క్రీస్తు చేసిన ఆత్మార్పణాన్ని గుర్తుంచుకోవాల్సిన అత్యంత పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే. ఈ సందర్భంగా క్రీస్తు ప్రేమను, దయను ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలి. ఈ అద్భుతమైన వాక్యాలను పలికిన వారు సంచయితా గజపతి. అంటే నాలుగైదు రోజుల కిందట అర్ధ రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోతో ఏకంగా సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డుకు చైర్మన్ గా నియమించిన వ్యక్తి అన్నమాట.
చర్చికి వెళ్లినంత మాత్రాన క్రైస్తవులు అవుతారా? మసీదుకు, గురుద్వారాకు వెళ్లిన వాళ్లంతా హిందూ మతం మారినట్లేనా అంటే ఎంతో అమాయకంగా ప్రశ్నించిన సంచయిత గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇలా ట్విట్టర్ లో మెసేజ్ పెట్టినంత మాత్రాన క్రైస్తవులం అయిపోతామా అని కూడా ప్రశ్నించవచ్చు.
మెసేజి ఎవరైనా పెట్టవచ్చు. అయితే సాధారణంగా క్రైస్తవ మతాన్ని విశ్వసించేవారే ఇలాంటి మెసేజ్ లు పెడతారు. అదీకాకుండా ఎవరు ఏ మత విశ్వాసాలను అయినా కొనసాగించవచ్చు. పుట్టకతో వచ్చిన మతాన్ని అయినా ఆ తర్వాత మారిన మతం అయినా సరే ఎవరికి అభ్యంతరం లేదు.
లేదా మతం మారకుండా కూడా వేరే మతాన్ని అనుసరించవచ్చు. ఎవరికి అభ్యంతరం లేదు. ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేం మతం మారితే నీకెందుకు అని ప్రశ్నించవచ్చు కూడా. అయితే అతి పవిత్రమైన సింహాచలం దేవస్థానానికి సారధ్యం వహించే వారు మాత్రం కచ్చితంగా హిందువు అయి ఉండాలి.
హిందూ ధర్మాన్ని పాటించాలి. హిందూ ధర్మంలో నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఉండాల్సిందే. ఇలా లేని వారిని కూడా ట్రస్టు బోర్డుకు చైర్మన్ గా నియమిస్తాం అని అంటే మనం చేయగలిగింది కూడా ఏం లేదు. మనం ఏం చేయలేమని తెలిసే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అర్ధ రాత్రి పదవి నుంచి తొలగించిన పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ సంచయిత ఏ మతానికి చెందిన వారూ తనకు తెలియదని చెప్పారు. పెద్ద మనిషి కాబట్టి ఆయన అలా చెప్పారు కానీ వాస్తవంగా సంచయిత అనుసరించే మతం ఏదో ఆయన చెప్పి ఉండాల్సింది.