కడప జిల్లా సిద్దవటం మండలం లోని జంగాలపల్లి ఇసుక రీచులో అక్రమ ఇసుక మాఫియాను అరికట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు డిమాండ్ చేశారు. మండలం జంగాలపల్లి ఇసుక రీచును సోమవారం ఆయన సందర్శించారు. ప్రభుత్వ ఈ సందర్బంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఆయన అడ్డగించారు.
జంగాలపల్లి గ్రామ ప్రజలతో కలసి అక్కడ ఏర్పాటు చేసిన ఇసుక క్వారీని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో టన్నుపై ఇసుక రేటును పెంచడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవలసిన ఖజానాను వైకాపా నాయకులు జోబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. జంగాలపల్లి గ్రామం సమీపంలో ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు అనుసరించకుండా ఇసుకను సుమారు 15 మీటర్ల లోతు త్రవ్వారని, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 18 టన్నుల అనుమతి ఉన్న టిప్పర్ కి 34 నుంచి 36 టన్నుల వరకు ఇసుకను వేసి ప్రభుత్వ విరుద్ధంగా తరలిస్తూ అక్రమార్జనకు తెరదీశారని ఆరోపించారు.
పరిసర ప్రాంతాల వారు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు, వృద్దులు ఎన్నో ప్రమాదాలకు గురై గాయపడి, మృతి చెందినా ప్రభుత్వ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. టెండర్ కాలపరిమితి పూర్తయినప్పటికీ అక్రమ రూపంలో ఇసుకను తరలిస్తున్నారని ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ నిబంధనలు మేరకే కాంట్రాక్టర్ స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుకను వేరే మార్గాన్ని ఏర్పరచుకొని ప్రభుత్వ నిబంధనలకు లోబడి తీసుకెళ్లాలని సూచించారు.
లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ తరపున జంగాలపల్లి గ్రామ ప్రజలకు తమ పూర్తి మద్దతుతో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. విషయాన్ని తెలుసుకున్న సిద్దవటం ఎస్సై తులసి నాగ ప్రసాద్, ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజులు స్థానిక ప్రజలకు సర్ది చెప్పి శ్రీరామనవమి వెళ్లి వచ్చిన వెంటనే ఇసుక రీచ్ దారులకు అనుమతి లేకుంటే ఇసుక క్వారీని మూసివేసి ప్రజలకు తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దశరధ రామానాయుడు,మోహన్ రెడ్డి, పుత్తా రామచంద్రయ్య, నాగముని రెడ్డి, గంజి సుబ్బరాయుడు, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.