కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మగాని వెంకటయ్య(98) కన్నుమూశారు. వెంకటయ్య ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, స్వాతంత్య్రసమరయోధులు బొమ్మగాని ధర్మభిక్షం సోదరుడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమర్తెలు ఉన్నారు. కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో తన రెండవ కుమారుడి నివాసంలో ఉన్న ఆయన రాత్రి అస్వస్తతకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. వెంకటయ్య కుటుంబం మొత్తం కమ్యూనిస్టు పార్టీతో మమేకమైంది.
ఆయన పెద్ద కుమారుడు బొమ్మగాని ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు బొమ్మగాని నాగభూషణం రాష్ట్ర నాయకునిగా పనిచేశారు. మూడవ కుమారుడు బొమ్మగాని శ్రీనివాస్ సిపిఐ సూర్యాపేట కార్యదర్శిగా పనిచేశారు. ఇద్దరు కుమార్తెలు నిర్మల, అరుణ కుటుంబాలు కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. వెంకటయ్య కుటుంబం మొత్తం కమ్యూనిస్టు కుటుంబంగా ఉంది.
1924లో బొమ్మగాని ముత్తులింగం, గోపమ్మ దంపతులకు వెంకటయ్యజన్మించారు. సోదరుడైన ధర్మభిక్షం బాటలోనే వెంకటయ్య కూడా చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో పనిచేస్తూ ఆంధ్రమహాసభలో చేరారు. 1945లో రాములమ్మను ఆయన వివాహం చేసుకున్నారు. పెళ్లి అయిన మరుసటి రోజే కమ్యూనిస్టు పార్టీ ఆదేశాల మేరకు భువనగిరి జరిగిన ఆంధ్రమహాసభకు వెళ్లారు. అనంతరం నిజాం వ్యతిరేక పోరాటంలో సూర్యాపేట ఏరియా దళ కమాండర్ పనిచేశారు. అలాగే కొంత కాలం కుటుంబంతో సహా పెనగంచిప్రోలు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయన అజ్ఞాతంలో ఉండగానే ఒక కుమారుడు పుట్టి మరణించాడు.
అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన అనంతరం సూర్యాపేట ఉమ్మడి తాలూకాలో గుంటకండ్ల పిచ్చిరెడ్డి, దేవులపల్లి రాఘవేంద్రరావు, గాలి వీరయ్య, నీల విశ్వనాథం, మూల అనంతరెడ్డి, చామల లచ్చయ్య, బాణాల గోపయ్యలతో కలిసి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం బలోపేతం కోసం విశేష కృషి చేశారు. కల్లుగీత వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం సూర్యాపేటలో గీతపనివారల సంఘాన్ని, సహాకార సోసైటీని ఏర్పాటు చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కల్లుగీత సోసైటీకి అధ్యక్షులుగా వరుసగా ఎన్నికై ఆదర్శ సోసైటీగా తీర్చిదిద్దారు. సోసైటీకి సొంత భవనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు గీతవృత్తిదారుల కోసం సోసైటీ అధ్వర్యంలో వనాలను అభివృద్ధి చేశారు. అలాగే అధిక శిస్తులకు వ్యతిరేకంగా రైతు సత్యాగ్రహం నిర్వహించారు.