తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవులను త్యాగం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉద్యమ పార్టీలోకి వలస వెళ్లిన నాయకుని ప్రోద్బలంతో కొందరు ఎస్సైలు వ్యవహరిస్తున్న విధానం పై జూపల్లి కృష్ణారావు సీరియస్ అవుతున్నారు.
ఇదివరకు ప్రతి మండల స్థాయి ముఖ్య అనుచరులతో సమావేశం అయినప్పుడు జూపల్లి ఇదే అంశాలపై ప్రధానంగా మాట్లాడారు. అక్రమ కేసులు పెడుతూ, కొందరు ఎస్సైలు వ్యవహరిస్తున్న తీరుపై ఇదివరకే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి జూపల్లి తీసుకుపోయారు.
తప్పుడు ఫిర్యాదులతో అక్రమ కేసులు పెడుతూ ప్రజా ప్రతినిధులను వేధించడమే కాకుండా రిమాండ్ కు తరలించే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. చివరికి రౌడీషీటర్ కేసులు కూడా చేశారు. కొందరిని జైల్ కు తరలించే ప్రయత్నాలు చేశారు. ఎవ్వరైనా సరే తప్పు చేస్తే వాస్తవాలపై విచారణ జరిపి అవి రుజువైతే వారి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి.
ఇది గొప్ప ప్రజాస్వామ్యం, చట్టానికి ఎవరు చుట్టం కాదు. కానీ కొల్లాపూర్ లో ఆ విధంగా నడుచుకోవడం లేదనే ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యవస్థలు అధికార పార్టీ నాయకులకు బందోబస్తు కల్పించే సెంట్రీ డ్యూటీలకు పరిమితం అయితే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని కూడా చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా జూపల్లి అనుచరులను టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అంశాల పైన జూపల్లి ఇది వరకు హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోవడం లేదు.
ఈ మధ్యనే జూపల్లి అనుచరులు,ఎమ్మెల్యే అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే జూపల్లి వర్గానికి చెందిన వారికి ఫోన్ చేసి కేసులు నమోదయ్యాయని స్టేషన్ కి రావాలని బెదిరించారు. అధికార నాయకుని అనుచరులపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని జూపల్లి వర్గీయులు అంటున్నారు. యథేచ్ఛగా నేరాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు రాజకీయ కేసులను మాత్రం అధికార పార్టీ నాయకులు చెప్పకుండానే వారే ముందుకు వచ్చి పెడుతున్నారు.
మొల చింతలపల్లి గ్రామ ఘర్షణకు కారణాలు…..
కొల్లాపూర్ మండలం మొల్ల చింతలపల్లి గ్రామంలో కొద్ది రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే దీనికి సంబంధించిన కారణాలను స్థానిక ఓ అధికారి తెలియజేశారు. ఆ గ్రామానికి చెందిన ఒకరు మామిడి తోటకు వాగులో మట్టిని తవ్వుతున్నారు. అయితే రాత్రి సమయంలో ఎమ్మెల్యే మనుషులు కొందరు ఫోన్ చేశారు. ఇసుక తవ్వితే మా ట్రాక్టర్లను సీజ్ చేస్తారు.
వాళ్ళ ట్రాక్టర్లను కూడా సీజ్ చేయారా? సీజ్ చేయాలన్నారు. పై అధికారి మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయినా వారు తీసేది ఇసుక కాదు కాలువ మట్టి అని ఆ అధికారి వాళ్లకు చెప్పారు. కానీ వారు రాత్రి సమయంలో పదే పదే ఫోన్ చేసి ఎమ్మెల్యే కు చెప్పి మీ సంగతి చూస్తాం, మీ అధికారి ఎవ్వడు? ఇక్కడ లేకుండా చేస్తాం అంటూ అసభ్యంగా మాట్లాడారని తెలిసింది.
అధికారి చర్యలు తీసుకునే లోపునే వారు ఆ మట్టి తవ్వే వ్యక్తి దగ్గరికి వెళ్లి చితకబాదారు. రక్తం కారుతున్న స్థితిలో అతను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. గాయాలు అయింది ఎవరికి? ఎందుకు ఘర్షణ జరిగింది అనే విషయాలు విచారణ జరిపితే తెలిసేది కానీ ఇక్కడ అలా జరగలేదని ఆరోణలు వినిపిస్తున్నాయి.
జూపల్లి వర్గీయుల అరెస్ట్ కు యత్నం..
మొదటగా దాడికి గురైంది జూపల్లి అనుచరులే. అయితే వారు మొదటగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుచరులు కూడా ఫిర్యాదు చేశారు. మొదటగా చావు దెబ్బలకు గురైన వారి కుటుంబ మహిళలు ఫిర్యాదు కూడా చేశారు. వారిపై ఏమి చర్యలు తీసుకున్నరో తెలియదు. అయితే జూపల్లి అనుచరుడు గ్రామ టిఆర్ఎస్ పార్టీ సింబల్ పై గెలిచిన సర్పంచ్ రాజు పై కేసు నమోదు చేశారు.
వారిని అరెస్ట్ తీసుకువస్తున్న సమయంలో జూపల్లి అనుచరులు పారిపోయారని ఎమ్మెల్యే అనుచరులే సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. గత కొన్ని రోజుల క్రితమే సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్ ను ఎమ్మెల్యే పరామర్శించారు. దాడిచేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సర్పంచ్ రాజు పై మరో నాన్ బెయిల బుల్ కేసు నమోదయ్యాయనీ ప్రచారంలో ఉంది. దాడిలో ఉన్నది ఎవరు? లేనిది ఎవరు? ఎవరిపై కేసులు నమోదు చేశారో అధికారులు పరిశీలించాలని అంటున్నారు.
సర్పంచ్ కోసం ఎస్సై గాలింపు.. ఉన్నతాధికారుల దృష్టికి?
అయితే కార్ గుర్తు పై గెలిచిన మొల చింతల పల్లి గ్రామ సర్పంచ్ రాజు ను ఇదివరకే స్థానిక ఎస్ఐ పోలీస్ స్టేషన్ దగ్గర అసభ్య పదజాలం ఉపయోగించాడని ప్రెస్ మీట్ లో సర్పంచ్ రాజు చెప్పారు. ఇప్పుడు మొదటగా ఫిర్యాదు ఇచ్చిన వారిపైన ఏం చర్యలు తీసుకున్నారో ఇంతవరకు చెప్పలేదు. కానీ సర్పంచ్ ను టార్గెట్ చేస్తూ ఎక్కడ ఉన్నారు వెతికే పనిలో ఉన్నారని అందిన సమాచారం. ఈ అంశం పై అధికారుల దృష్టికి పోయినట్లు సమాచారం.
మరో ఉద్యమానికి మాజీ మంత్రి జూపల్లి శ్రీకారం?
తన అనుచరుల పై,నియోజకవర్గ ప్రజలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోం అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇదివరకే హెచ్చరిస్తు వచ్చారు. ఇలా ఎన్నో సార్లు హెచ్చరించారు. ఇకపై చూస్తూ ఉండాలేనని నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే సహించబోమని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై జూపల్లి ప్రత్యేక ఉద్యమ కార్యక్రమం చేపడుతున్నట్లు సమాచారం అందుతుంది. పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర రాజధాని వరకు వాహనాలకు బ్యానర్లు పెట్టీ ర్యాలీ చేస్తూ, డీజీపి ఆఫీస్ ముందు నిరసన చేస్తామని ముందే హెచ్చరిస్తు వచ్చారు.
అంతేకాదు పోలీస్ స్టేషన్ ల ముందు వేల మంది ప్రజలతో ధర్నాలు చేస్తామని కూడా గతంలోనే చెప్పారు. ఆ విధంగా జూపల్లి ఓ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకోవాలి. అంతేగాని కక్ష సాధింపులకు పాల్పడవద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అమలు చేస్తుంటే కొల్లాపూర్ లో అవి మరిచారు.
ప్రజలను వేధించడం, ప్రజలను దూషిస్తూ అసభ్యంగా ప్రవర్తించడం సరైనది కాదని జూపల్లి చెబుతున్నారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. బాధ్యతను వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్