విధి నిర్వహణలో చూపిన అంకిత భావాన్ని, ఉత్తమ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) కుశాల్కర్ కు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సేవ పతకాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఐదు నెలల క్రితమే షాద్నగర్ ఏసీపీగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పథకం లభించడం విశేషం. ఇటీవల కాలంలో ఏసీపీగా శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. బదిలీపై వచ్చిన అనతి కాలంలోనే అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఇదీ ఏసీపీ కుషాల్కర్ నేపథ్యం..
ఏసీపీ కుశాల్కర్ స్వస్థలం జహీరాబాద్ ప్రాంతంలోని నాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామం. తన చదువులు మొత్తం హైదరాబాదులోనే కొనసాగాయి. ఉస్మానియాలో ఎంఎస్సి చేశారు. కుశాల్కర్ సతీమణి ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో గజిటెడ్ అధికారినిగా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. మొదట్లో ఈనాడు దినపత్రికలో సర్క్యులేషన్, అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో పని చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. 1995 బ్యాచ్ కు చెందిన కుషాల్కర్ ఎస్సైగా పోలీసు జీవితాన్ని ప్రారంభించారు. 1996 నుండి 2000 సంవత్సరం వరకు ఎస్సైగా నిజామాబాద్ జిల్లాలో నాలుగేళ్లపాటు పని చేశారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన నిజామాబాద్లో 13 సార్లు ఎదురుకాల్పుల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
అప్పట్లో భీభత్సంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 14 మంది నక్సలైట్లు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాదు 250 మంది మిలిటెంట్లను కుషాల్కర్ అరెస్టు చేసిన ఘనత కావడం విశేషం. పోలీసు శాఖలో ఈ ధైర్య సాహసాలకు గాను మొట్టమొదటి సారిగా “కఠిన సేవా పథకం” ఆయనను వరించింది. ఆ తరువాత హైదరాబాద్ లోని టాస్క్ ఫోర్స్ విభాగానికి ఆయన బదిలీ అయ్యారు. బేగంబజార్ తదితర ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించారు.
2007 డిసెంబర్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి లభించింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా భీంగల్, ఆర్మూర్ ప్రాంతాల్లో పనిచేశారు. అదేవిధంగా 2012లో సైబరాబాద్ కమిషనరేట్లో రెండేళ్లపాటు ఎస్వోటీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు. రాజేంద్రనగర్, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల్లో ఆయన సిఐగా సేవలు అందించారు. 2018లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీగా పదోన్నతి పొందారు సిసిఎస్ విభాగంలో రెండేళ్లపాటు పనిచేసి వైట్ కాలర్ నేరాల పై ఉక్కుపాదం మోపారు.
వైట్ కాలర్ నేరాలను నిరోదించడంలో కుషాల్కర్ కు మంచి ప్రావీణ్యం ఉంది. 5 నెలల క్రితం షాద్ నగర్ ఏసీపీగా బదిలీపై వచ్చారు. అయితే ఏసీపీ కుశాల్కర్ ఇప్పటివరకు 22 సార్లు క్యాష్ రివార్డులను పొందడం గమనార్హం. గుడ్ సర్వీస్ సెంటర్ (జిఎస్సి), మెరిటరీస్ సర్వీస్ సెంటర్ (ఎంఎస్సి) ప్రశంసలు కూడా దక్కాయి. అంతేకాదు ఆయన ఇప్పటి వరకు ఉత్తమ సేవలకు గాను ఎనిమిది ప్రశంసాపత్రాలను కైవసం చేసుకున్నారు. పాతబస్తీలోని మతఘర్షణల సమయంలో ఆయన ప్రత్యేక సేవలను అందించారు.
ఆనందంగా ఉంది – ఏసీపీ కుషాల్కర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రకటించబడిన పోలీసు ఉత్తమ సేవా పథకం పట్ల షాద్ నగర్ ఏసిపి కుషాల్కర్ ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తమ సేవలకు గాను ప్రభుత్వం తనకు ఈ అవార్డు ఎంపిక చేయడం సంతోషంగా ఉందని, దీనివల్ల మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆయన సత్యం న్యూస్ ప్రతినిధికి తెలిపారు.
గతంలో పోలీసు శాఖ ద్వారా అనేక అవార్డులు, రివార్డులు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం చేత ఈ పురస్కారం లభించడం జీవితంలో మర్చిపోలేనిదని ఆయన తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పురస్కారాలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.