మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బహిష్కరించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అయింది. ఇప్పటికే బిజెపిలో చేరేందుకు నిర్ణయించుకున్న రాజేందర్ త్వరలో పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది.
ఆయన రాజీనామా చేయడానికి ముందుగానే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఈటలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండు రోజుల కిందటే ప్రకటించారు.
అయితే ఢిల్లీకి వెళ్లి నాలుగు రోజుల పాటు పలువురు బిజెపి నేతలతో భేటీ అయిన ఈటల… గురువారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే.
అనంతరం పలువురు నేతలతో దీనిపై చర్చించినట్లు సమాచారం. గతంలో టీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారంటే… ముందుగానే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేశారు.
రాములు నాయక్ తో పాటు పలువురు నేతల వ్యవహారంలో ఇదే జరిగింది.
ఇప్పుడు ఈటల అంశంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారనే క్రెడిటు వారికి దక్కకుండా ముందుగానే పార్టీ నుంచి తొలిగించినట్లు ప్రకటిస్తే ఇక ఏ పార్టీలో చేరినా తమకేం సంబంధం అనే రీతిలో టీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తోంది.