జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక పబ్లిక్ ఫిగర్. అలాంటి వ్యక్తి పైనే నిఘా వేశారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. ఆయన ఇంటిలో నుంచి బయటకు వచ్చే సమయంలో వెళ్లే సమయంలో అనుసరిస్తున్నారు. కారులో లేదా ద్విచక్ర వాహనంలో పవన్ కల్యాణ్ ను అనుసరిస్తున్నారు. వారు ఎవరికి సమాచారం అందిస్తున్నారో తెలియదు కానీ వారు మాత్రం పవన్ కల్యాణ్ పై నిఘా వేసి ఉంచారు.
ఇదే విషయాన్ని జనసేన నాయకులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ను ఈ మధ్య అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువగా అనుసరిస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యంగా విశాఖ సంఘటన తర్వాత ఇది నిరంతరంగా జరుగుతున్నదని ఆయన తెలిపారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని కూడా పవన్ కల్యాణ్ వ్యక్తిగత నిఘా సిబ్బంది చెబుతున్నారు.
సోమవారం అర్ధ రాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవకు పాల్పడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది సంయమనం పాటించి వారిని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేసినా కూడా వారు కవ్వించి రెచ్చ గొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన మొత్తం వీడియో తీసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.