జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరులో వెలిసిన శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయం రథసప్తమికి ముస్తాబు అవుతున్నది. సూర్యభగవానుడా నమామ్యహం అంటూ భక్తులు సూర్యభగవానుడిని స్తుతించడానికి సిద్ధమవుతున్నారు. ఉండవెల్లి మండలం పుల్లూరులో వెలిసిన శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి వేడుకలకు సిద్ధం అవుతున్నది. 7 శతాబ్దానికి చెందిన ఈ పురాతన చరిత్ర కలిగిన ఆలయంలో రథసప్తమిని
పురస్కరించుకొని ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఆలయంలో నిర్వహించే ఈవేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. పుల్లూరులో వెలిసిన ఆలయాల్లో సూర్యనారాయణ స్వామి ఆలయం ఒకటి. 7వ శాతాబ్దంలో చాళుక్యులలో రెండో పులకేశి సూర్యనారాయణ స్వామి ఆలయం నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామి వారు భక్తులతో విశేష పూజలు అందుకుంటున్నారు.
ఈ ఆలయంలో వెలిసిన సూర్యనారాయణ స్వామి పాదాలను లేలేత కిరణాలు తాకుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ సమయంలో స్వామి వారిని దర్శించుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పురాతన చరిత్ర కలిగిన గ్రామాల్లో పుల్లూరు ఒక టిగా ఉంది. తుంగభద్ర నది ఒడ్డున ఈ గ్రామంవెలిసింది. గతంలో ఈ గ్రామాన్ని పూల ఊరుగా పిలిచేవారు. కాలక్రమేనా పుల్లూరుగా మారింది. తుంగభద్రలోని 64 స్నానపు ఘట్టాల్లో ఇది ఒకటిగా చెప్పుకుంటారు.
గతంలో తెలంగాణ రాయలసీమ మధ్య రాకపోకలు ఈ గ్రామం నుంచే కొనసాగేవి. అందుకుగాను ఇక్కడ గతంలో ధాన్యం తరలింపునకు సంబంధించిన సుంకం చెల్లించే వారని స్థానికులు చెబుతారు. గతంలో రాయలసీమలోని నాటి నిడదవోలు నేటి నిర్జూరు నవాబు గద్వాలను పాలించిన నల్లసోమానాద్రికి యుద్ధం జరిగినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకోనున్నారు.