జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా, వాడివేడీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అధికార ప్రతిపక్షాలు పదునైన మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పక్షం టీఆర్ఎస్ ఒక్క అడుగు ముందుకేసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలకు తాయిలాలను ప్రకటించింది.
ఇందులో ముఖ్యమైనవి
- డిసెంబర్ నుంచి 20 వేల లీటర్ల మంచినీరు పూర్తిగా ఉచితం
- కమర్షియల్ కనెక్షన్లకు ఆర్నెళ్ల కనీస విద్యుత్తు చార్జీ రద్దు
- సెలూన్లు, దోభీఘాట్లు, లాండ్రీలకు ఉచిత కరెంట్
- థియేటర్లు తెరిచేందుకు అనుమతి.. మరిన్ని షోలు
- మూసీకి గోదావరి నీళ్లు.. సుందరంగా పరీవాహకం
- మహానగరంలో మౌలిక సదుపాయాల కల్పన
24 గంటలపాటు నీటి సరఫరా తన కలని మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా సీఎంకేసీఆర్ ప్రకటించారు. ప్రజలంతా ఈ నీటి వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే నీటి దుబారాను అరికట్టాలన్నారు. జలమండలికి రూ.300-రూ.400 కోట్లు ఇస్తామని స్పష్టం చేశారు. జంటనగరాల్లో ఈ కార్యక్రమం విజయవంతమైతే నాలుగైదు మాసాల్లో అన్ని మున్సిపాలిటీల్లో అమలుచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ చట్టం
జీహెచ్ఎంసీ చట్టంలో మరిన్ని మార్పులు తీసుకోస్తామన్నారు. అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా జీహెచ్ఎంసీ చట్టం ప్రజలకు పారదర్శకంగా, అవినీతిరహితంగా ఉండేలా రూపకల్పన చేస్తామన్నారు.
మెట్రో ఏయిర్పోర్ట్ వరకూ విస్తరణ
మెట్రో సెకండ్ ఫేజ్లో ఏయిర్ పోర్టు వరకూ విస్తరిస్తామన్నారు. ఏ నగరంలోనైనా ఏయిర్పోర్ట్తో అనుసంధానం అయితే అక్కడ భవిష్యత్ బాగుంటుందన్నారు.
రీజినల్ రింగ్రోడ్ నిర్మిస్తాం
ఇక నగరానికి తలమానికంగా రీజినల్ రింగ్ రోడ్డును కూడా రాష్ర్ట ప్రభుత్వమే నిర్మిస్తామని స్పష్టం చేశారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్రం ఈ రోడ్డును నిర్మిస్తామని ఓ పక్క చెబుతూనే వెన్నుచూపి పారిపోయిందని ఎద్దేవా చేశారు.
సినిమా థియేటర్లతోపాటు చిన్నా చితక.. పెద్ద.. ఇలా అన్నిరకాల, వర్తక, వ్యాపార సంస్థలు కరోనా కష్ట కాలంలో విపరీతంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా హార్టికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్, గృహ వినియోగం మినహా మిగతా అన్ని కమర్షియల్ విద్యుత్తు కనెక్షన్లకు ‘మినిమం డిమాండ్ చార్జీలను’ రద్దుచేస్తున్నామని సీఎం ప్రకటించారు.
గోదావరి నీటితో గండిపేట్, హిమాయత్సాగర్ నింపుతాం
మూసీ రివర్ ఫ్రంట్ ద్వారా గోదావరి నీళ్లతో గండిపేట, హిమాయత్సాగర్ నింపుకొనేటట్టు చేస్తామన్నారు. మూసీని గోదావరితో అనుసంధానం చేసి కాలుష్యం లేని మూసీ నదిగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన రీతిలో తీర్చిదిద్దుతామన్నారు.
ఉచిత విద్యుత్!
రాష్ట్రవ్యాప్తంగా నాయీబ్రాహ్మణులకు, రజకులకు ఉచిత విద్యుత్ను అందజేస్తామని చాలా ఏండ్లుగా వారు కోరుతున్న కోరికను తీరుస్తామని సీఎం స్పష్టం చేశారు.