వికారాబాద్ జిల్లాలోని బొంరాస్పేట మండలం మదనపల్లి నుంచి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని బొంరాస్పేట గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి పాద యాత్ర ప్రారంభించారు.
మదనపల్లి నుంచి దుద్యాలకు సాగుతుండగా మార్గం పక్కనున్న వేరుసెనగ తోటల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలను రేవంత్ పలకరించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి ఖర్చులు, మార్కెట్లో పంటకు లభిస్తున్న ధర గురించి కూడా ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని 60 రోజులపాటు సాగే ఈ పాదయాత్రలో గ్రామగ్రామానికి తీసుకువెళతామని రేవంత్ తెలిపారు.
దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని, రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిజాం, బ్రిటిషర్ల పాలనను తలపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ అనైతిక రాజకీయాలకు ప్రయోగశాలగా దేశాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్చివేసిందని ఆయన ఆరోపించారు.