కరోనా మహమ్మారి మొదటి విడతలో ప్రజలందరూ క్రమశిక్షణతో సాగించిన పోరాటంలో విజయం సాధించామని అదే ఒరవడి ఇప్పుడూ కొనసాగించాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ కోరారు.
రెండో విడత కరోనా మహమ్మారి తన రూపం మార్చుకుని మరింత తీవ్రంగా విరుచుకుపడుతున్నదని అందువల్ల ప్రజలు మరింత క్రమశిక్షణతో ఉండాలని ఆయన కోరారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని ఆయన తెలిపారు.
ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవడం కోసం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సడలింపు ఇచ్చామని, ఇందుకు ప్రజలు అవసరాన్ని బట్టి బాధ్యతతో, క్రమశిక్షణతో తగిన జాగ్రత్తలు పాటించుకుంటూ నిత్యావసర వస్తువుల కొనుగోలు చేసుకోవాలని ఆయన కోరారు.
మార్కెట్ కి వెళ్ళినప్పుడు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం తప్పకుండా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలు పాటించి వ్యాపార సముదాయాలన్ని ఉదయం 10 గంటలకే మూసివేయాలని వ్యాపారస్తులఅందరికీ ములుగు పోలీసుల తరపున ఆయన విజ్ఞప్తి చేశారు.