సీఎం కేసీఆర్ నియోజకవర్గం అభివృద్ధి చూడటానికి బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన చలో గజ్వేల్ యాత్ర రణరంగాన్ని తలపించింది. నేడు గజ్వేల్ యాత్రకు అన్ని సిద్ధం చేసుకోగా నిన్న రాత్రే వెంకట రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కామారెడ్డి జిల్లా బిచ్కుందకు తరలించారు. అయినా గజ్వేల్ యాత్ర ఆగబోదని బీజేపీ ప్రకటించింది. గజ్వేల్ వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న వాహనాలను పోలీసులు తీసుకెళ్లడంతో బైకులపై వెళ్ళడానికి కార్యకర్తలు సిద్ధమయ్యారు.
ఉదయం 9 గంటలకు రమణారెడ్డి ఇంటివద్దకు కార్యకర్తలు ఒక్కొక్కరుగా చేరుకోవడంతో రమణారెడ్డి ఇంటిచుట్టు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు రాకపోకలను నిలిపివేశారు. అయినా కార్యకర్తలు గ్రూపుల వారిగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గజ్వేల్ వెళ్లి తీరుతామని కార్యకర్తలు భీష్మించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వందలాదిగా తరలివస్తున్న కార్యకర్తలను కంట్రోల్ చేయలేక పోలీసులు అనేక ఇబ్బందులు పడ్డారు. డిసిఎం వ్యాను తెప్పించి అరెస్ట్ చేసిన కార్యకర్తలను డిసిఎం వ్యానులో ఎక్కించి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. పోలీసుల అరెస్టుతో రమణారెడ్డి ఇంటివద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. విడతల వారిగా వచ్చిన కార్యకర్తలను వెంటవెంటనే అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రమణారెడ్డి ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకోనడంతో కొందరు బీజేపీ కార్యకర్తలు కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తాలో ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చెప్పిన గజ్వేల్ అభివృద్ధి చూడటానికి పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
సీఎం చేసిన అభివృద్ధి చూసి ఇక్కడి ప్రజలకు వివారిస్తామని చెప్పామన్నారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి తమను అరెస్ట్ చేయడంతో గజ్వేల్ లో వెంకట రమణారెడ్డి చెప్పినట్టుగా అక్రమాలు, భూ కబ్జాలు, షాడో ఎమ్మెల్యేల అరాచకాలు ఉన్నాయని స్పష్టమైందన్నారు. అందుకే తాము అక్కడికి వెళ్తే అవన్నీ బయట పడతాయన్న ఉద్దేశ్యంతోనే కామారెడ్డిలో అరెస్ట్ చేయించారన్నారు. అలాంటప్పుడు గజ్వేల్ లో జరిగిన అభివృద్ధి ఇక్కడ అవసరం లేదని, కేసీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు