30.7 C
Hyderabad
April 29, 2024 05: 56 AM
Slider సంపాదకీయం

అధికార వైసీపీలో కలకలం రేపిన ఎంపి వ్యాఖ్యలు

#pilli

ఎన్నికల ఏడాదిలో అధికార  వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇందులో మాజీ మంత్రులు, సీనియర్ నేతల స్థానాలు కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా, ఇటు గుంటూరులో అంబటి రాంబాబు, విడదల రజనీ,  విశాఖలో అవంతి,   గోదావరిలో పిల్లి చంద్రబోస్ ఇలా బడా బడా నేతల జిల్లాలు, స్థానాలలోనే ఈ అంతర్గత యుద్ధం నడుస్తోంది. అసమ్మతి నేతలను బుజ్జగించి శాంతింపజేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నా కూడా పార్టీలో అంతర్గత చిచ్చు తగ్గినట్లే తగ్గి మళ్ళీ రాజుకుంటోంది. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నేతలు కొందరికి వారి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పొసగడం లేదు. అందుకే ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను విడదీసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మీడియా ముందే ఇష్టం వచ్చినట్లు ఆల్టిమేటాలు జారీ చేస్తున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ టికెట్‌ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామచంద్రాపురం ఎమ్మెల్యేగా శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఉన్నారు. ఈయన జగన్‌ మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ, సమాచార శాఖల మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇక్కడ నుండి సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుండి జగన్ తోనే ఉన్న పిల్లిని ఎమ్మెల్సీని చేసి మంత్రిగా చేశారు. అయితే, ఆ తర్వాత మండలి రద్దు చేస్తానంటూ పిల్లితో రాజీనామా చేయించి రాజ్యసభకు పంపించారు. ఈసారి ఎలాగైనా రామచంద్రపురం నుండి తాను కానీ, తన కుమారుడు కానీ పోటీ చేయాలని పిల్లి సుభాష్ భావిస్తున్నారు.

కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే చెల్లుబోయిన ఈసారి కూడా తనకే టికెట్ రావడం ఖాయమని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కొంత కాలంగా ఇక్కడ వార్ నడుస్తుంది. ఇప్పటికే పిల్లి సుభాష్ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయనున్నట్లు వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. వైసీపీ పెద్దలు ఈ విషయంపై పిల్లి సుభాష్, ఎమ్మెల్యే చెల్లుబోయినతో సంప్రదింపులు జరిపి సీఎం జగన్ వద్దకు పంచాయతీ తీసుకెళ్లారు. మరోవైపు ఎమ్మెల్యే చెల్లుబోయినను ఈసారి పార్లమెంటుకు పోటీ చేయించనున్నట్లు కూడా ఊహాగానాలు బయటకొచ్చాయి. దీంతో పిల్లి అప్పటికి కాస్త శాంతించినట్లు కనిపించారు. కానీ, ఏమైందో ఏమో మళ్ళీ ఇప్పుడు తగ్గేదేలే అంటూ బయటకొచ్చారు.

తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురంలో పోటీ చేసేది తన కుమారుడేనని తేల్చి చెప్పారు. తాజాగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. త్వరలోనే తన కుమారుడు సీఎం వైఎస్‌ జగన్‌ తో భేటీ అవుతారని.. కార్యకర్తల అభీష్టాన్ని సీఎంకు తెలుపుతాడని వెల్లడించారు. సీఎం నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని.. తమ కుమారుడిని ఆశీర్వదించాలని కార్యకర్తలను కోరారు. కానీ, ఎమ్మెల్యే చెల్లుబోయిన మాత్రం చాపకింద నీరులాగా నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అటు జిల్లా పార్టీ నుండి వైసీపీ అధిష్టానం వరకూ వీరవిధేయుడిగా ఉంటూ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని మంతనాలు జరుపుతున్నారు. దీంతో ఈ సమస్య నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నది. మొత్తం మీద రామచంద్రాపురంలో పార్టీ పరిస్థితి, నేతల తీరు జగన్ కు తలనొప్పిగానే మారిందని అంటున్నారు పరిశీలకులు.

Related posts

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందచేయడమే లక్ష్యం

Satyam NEWS

పాపాల భైరవుడు కేసీఆర్ కు కాలం చెల్లింది

Satyam NEWS

ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం మాస్క్ ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment