వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాల పిజి మొదటి సంవత్సరం విద్యార్థిని ధారావత్ ప్రీతి మృతి పై రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జర్జిచే విచారణ జరిపించాలని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసి, 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థుల పట్ల జరుగుతున్న ర్యాగింగ్ ను గుర్తించి, అరికట్టడంలో విఫలమైన కే.ఎం.సి. సూపరిండెంట్ మరియు ప్రిన్సిపాల్ లను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్ధానిక ఖమ్మం నగరంలో పి.డి.ఎస్.యు అధ్వర్యంలో మహిళ డిగ్రీ కళాశాల నుండి భారీ నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న దారావత్ ప్రీతి తనపై సీనియర్ విద్యార్థి అయిన సైఫ్ ఉద్దేశపూరితంగా అవమానిస్తూ, ర్యాగింగ్ కు పాల్పడుతున్నాడని ప్రీతి తల్లిదండ్రులు పోలీసుల ద్వారా కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సీనియర్ విద్యార్థి అయిన సైఫ్ తరపున వకాల్తా పుచ్చుకొని, అతను చేసిన ఆగడాలను కప్పిపుచ్చి, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ప్రీతి మరణించిందని అన్నారు.
ప్రీతి మృతి పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నందువలన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపి సైఫ్ కు అతనికి సహకరించిన వారందరి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటివలి కాలంలో నిజామాబాద్ మెడికల్ కళాశాలలో హర్ష అనే విద్యార్థి, నేడు నర్సంపేట జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో రక్షిత అనే విద్యార్థిని సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కు బలి కావడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ ను అరికట్టే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరుస ఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తక్షణమే స్పందించాలన్నారు. విద్యసంస్థలలో ర్యాగింగ్ వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించి, ర్యాగింగ్ అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటేష్, జిల్లా కోశాధికారి లక్ష్మణ్, జిల్లా నాయకులు కరుణ్, గణేష్, తరుణ్, రవీందర్, రమ్య, అనిత, ప్రియ, కమల , దేవి, తదితరులు పాల్గొన్నారు.