రాహుల్ గాంధీపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులంతా గాంధీభవన్లో ఒక రోజు దీక్షకు దిగాయి. వర్గాలు, గ్రూపులు, సీనియర్లు-జూనియర్ తేడా లేకుండా పార్టీ నేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ థాక్రే సహా రాష్ట్ర నాయకులందరూ భిన్నాభిప్రాయాలు, విభేదాలను పక్కనపెట్టి హాజరయ్యారు. యం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ నల్ల చొక్కలతో దీక్షకు హాజరయ్యారు. మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ సైతం గాంధీ భవన్కు వచ్చారు. తన సొంత ఇంటికి వెళ్ళినదానికంటే సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీలో తనను చేర్చుకోవాల్సిన అవసరం ఏముందంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్లో చేరుతున్న సందర్భంగా వచ్చానని, రాహుల్గాంధీ వ్యవహారంతో దీక్షలో పాల్గొంటున్నట్లు వివరించారు. నేతలు మాట్లాడుతూ రాహుల్గాంధీపై లోక్సభ సెక్రటేరియట్ చర్య తీసుకోవడం బీజేపీ పథకం ప్రకారం ఆడిస్తున్న డ్రామా అని వ్యాఖ్యానించారు. అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలంతా మూకుమ్మడిగా ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని, ఇప్పటికే పార్టీలో ఈ దిశగా ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయని తెలిపారు. రాహుల్గాంధీ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
previous post
next post