సెప్టెంబర్ నెలలో చేపట్టే పోషణ మాస కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పోషణ మాస కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోషణ మాస కార్యక్రమంలో ఆరోగ్యానికి చిరుధాన్యాల వినియోగం – వాటి లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు లైన్ డిపార్ట్మెంట్ లు అయిన వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యా తదితర శాఖలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో రక్త హీనత, ఇతర జబ్బులను అరికట్టడానికి పోషణ మాస కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా 5 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బరువు, కొలతలు నిర్దిష్ట ప్రమాణాల్లో ఉన్నాయా లేదా చూడాలన్నారు. ఇప్పటి వరకు ఏ పిల్లవాడికి ఏ ఏ టీకాలు ఇవ్వడం జరిగింది, ఇంకా మిగిలిపోయిన టీకాలు ఉంటే చర్యలు తీసుకోవాలని అన్నారు. నట్టాల నివారణ మందుల పై విస్తృతంగా ప్రచారం, అవగాహన కార్యక్రమం చేపట్టాలన్నారు.
పిల్లలు, గర్భిణీలకు పౌష్టికారం పై అవగాహన కల్పించడం, 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలలో మామ్, సామ్ పిల్లలను గుర్తించి, వారిని మాములు పిల్లలుగా చేయుటకు చర్యలు చేపట్టాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాల, వసతి గృహాలలో కిచెన్ వార్డెన్లు నిర్వహించాలన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం, పౌష్టికాహారం, బాల్య వివాహాల నిర్మూలన, మహిళలకు ఉపాధి అవకాశాలు వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. కౌమార దశ అమ్మాయిలు, గర్భిణీలకు రక్త పరీక్షలు నిర్వహించి, జిల్లాలో ఎంతమంది రక్త హీనతతో బాధపడుతున్నారో ఖచ్చితమైన నివేదిక రూపొందించాలన్నారు.
మున్సిపాలిటీ, మండలాలు, ప్రతి గ్రామంలో పౌష్టికాహారం, చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం పై విస్తృతంగా ప్రచారం, అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోషణ్ మాస కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రిక, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు