ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా నిలయమా పార్టీ భవనమా అని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మిర్యాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా క్యాంపు కార్యాలయాన్ని వినియోగించాల్సి ఉందని అన్నారు. అయితే కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారని ఆయన ఆరోపించారు. గతంలో యువజన కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యల సాధనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి జెండా ఎగరేస్తేనే కేసులు పెట్టించారని ఆయన గుర్తు చేశారు.
అలాంటి ఎమ్మెల్యే అదే భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చడం ఎంత వరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం,కొత్త పింఛన్ల కోసం,ఎస్టీ,ఎస్టీలకు మూడెకరాల భూమి కోసం,కెఎల్ఐ భూ నిర్వాసితుల పరిహారం కోసం,ఎస్సి,ఎస్టీ,బిసి,మైనార్టీ లోన్ల కోసం,ప్రగతిలో ఉండాలనే అన్ని వర్గాల ఎదురుచూపులకు ఎమ్మెల్యే భరోసా ఇవ్వాలని మిర్యాల శ్రీనివాస్ రెడ్డి కోరారు.
ప్రజల ఆశలను,ఆశయాలకు భిన్నంగా తూట్లు పొడిచే విధానాలను అవలంభించడం మంచిది కాదని, ప్రజల్లో ప్రజా వ్యవస్థల పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లే ప్రయత్నాలు చేస్తే అబాసుపాలు కావడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజా కార్యాలయాన్ని ప్రజల కోసం, ప్రజల సమస్యల సాధన కోసం ఉపయోగిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోరేటి జంగయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు షాకీర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.