రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూముల్లో నిబంధనల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టకుండా వాటిని ఇళ్ల స్థలాలకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి పనులు చేపట్టాక సమీకరించిన భూమిలో 5శాతం భూమిని పేద ప్రజల ఇళ్ల నిర్మాణ పథకానికి కేటాయించాలని సీఆర్డీఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయని గుర్తుచేసింది.
అభివృద్ధి పనుల బాధ్యతను నిర్వర్తించకుండా ప్రభుత్వం ఏకపక్ష చర్యలు తీసుకోజాలదని వ్యాఖ్యానించింది. అమరావతి నిర్మాణానికి రైతులు నుంచి సమీకరించిన భూమిలో రాజధాని పరిధిలో లేని గ్రామాల పేదలకు ఇళ్ల స్థలాల కోసం 1251 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఈనెల 25న జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాల కేటాయింపును ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియజేస్తూ సోమవారం నాటికి ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మార్చి 4కు వాయిదావేసింది. ఈలోపు లబ్ధిదారులకు ప్రభుత్వం పట్టాలిస్తుందేమోనని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేయగా మార్చి 25కి ముందు పట్టాలు ఇవ్వడం లేదని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మౌఖికంగా తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ధర్మాసనం ఇందుకు అంగీకరించింది.