రాజ్యసభలో విజయసాయిరెడ్డికి జరిగిన ఘోర పరాభవంపై వైసీపీలో విస్తృత చర్చ జరుగుతున్నది. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ కు ఎంపికైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. విజయసాయిని వైస్ చైర్మన్ ప్యానెల్ నుంచి తప్పిస్తూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 మందితో రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ ను తొలుగ ప్రకటించారు. అయితే, రాజ్యసభలో ప్యానెల్ సభ్యుల జాబితాను సవరించి వెల్లడించే క్రమంలో ఏడు పేర్లే చదివారు. అందులో విజయసాయి పేరు లేదు. ఆయనను వైస్ చైర్మన్ ప్యానెల్ నుంచి తొలగించినట్టు రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు.
ఇది సాధారణంగా చూస్తే ఒక వ్యక్తికే కాకుండా సంబంధిత పార్టీమొత్తానికి తీరని అవమానం కిందికి వస్తుంది. బీజేపీతో ఎంతో సఖ్యత ఉందని, తాము ఏం చేసినా ఢిల్లీ పెద్దలు ఏమీ అనరు అనే పరిస్థితిలో ఈ పరిణామం తీరని ఆవేదన మిగిలుస్తున్నదని వైసీపీ నాయకులు అంటున్నారు.
బీజేపీతో సఖ్యత నెరపడంలో విజయసాయి రెడ్డే కీలక పాత్ర పోషించేవారని అంటున్నారు. అలాంటి వ్యక్తికే ఇంత అవమానం జరగడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయసాయి రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ తనకు ఏం జరగలేదని, అది తనకు అవమానం కాదని తన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇది కచ్చితంగా అవమానమే అనే భావనలో ఉన్నారు. బీజేపీతో సంబంధాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో పలుచనైన విషయం తెలిసిన మరుక్షణం బిజెపి తన వ్యూహాన్ని మార్చుకుంటుందని కొందరు సీనియర్ నాయకులు చెబుతున్నా కూడా ఢిల్లీ బీజేపీ నేతల్ని మేనేజ్ చేయడం పెద్ద కష్టమైన పని కాదని వైసిపి అగ్రనేతలు భావించేవారని, ఇప్పుడు అసలు విషయం బయటకు వస్తున్నదని అంటున్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికలలో బిజెపికి బలం తగ్గుతుందని, అప్పుడు తమ అవసరం ఉంటుందని మాత్రమే వైసీపీ లెక్కలు వేసుకుని ఇంత కాలం బీజేపీ తమ చేతిలో ఉంటుందనే లెక్కలు మాత్రమే వేసుకున్నారు. ఈ లెక్క కాకుండా వేరే లెక్కల జోలికి వెళ్లకపోవడంతో ఇప్పుడు బిజెపితో సంబంధాలపై పలు వ్యాఖ్యానాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయసాయి రెడ్డి ఢిల్లీ లాబీని పూర్తిగా అదుపు చేస్తుంటారు. ఢిల్లీలో జరిగే ప్రతి విషయం తనకు ముందే తెలిసే విధంగా ఆయనకు పూర్తి నెట్ వర్క్ ఉంది. ఇలా ఆయన పూర్తి స్థాయిలో బలపడేందుకు సీఎం జగన్ పూర్తిగా సహకరించారు.
దాంతో ఆయనకు ఢిల్లీలో ఎదురు లేకుండాపోయింది. ఈ ధీమాతోనే బీజేపీ నేతలను కూడా మేనేజ్ చేయవచ్చునని వైసీపీ భావించింది. వైసీపీలో తమకు అనుకూలంగా మాట్లాడేవారిని కాపాడుకుంటూ వచ్చిన వైసీపీ తమ వ్యతిరేకులను పూర్తిగా అణచి వేసింది. బీజేపీలో కూడా తమ రాజకీయమే సాగుతుండటంతో వైసీపీ ఇంత కాలం పూర్తి స్థాయిలో ఆనందంగా ఉన్నది. రాష్ట్రంలో తమను విమర్శించే నాయకులు తెలుగుదేశం పార్టీని కూడా కలిపి విమర్శించే విధంగా వైసీపీ ప్లాన్ చేసుకునేది. అలా తెలుగుదేశం పార్టీని అడ్డుకోవాలని వైసీపీ నేతలు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కథ అడ్డం తిరుగుతున్నదని కొందరు వైసిపి నేతలు అనుమాన పడుతున్నారు. దానికి సంకేతమే విజయసాయి రెడ్డికి జరిగిన ఈ ఘొర అవమానమని అంటున్నారు.