చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం సంతోషంగా ఉందని,బిల్లును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని ,అయితే ఇందుకు సంబంధించి జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెల్లడించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
లోక్ సభలో మహిళా బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ నామ పాల్గొని మాట్లాడారు. బిల్లును బీఆర్ ఎస్ పార్టీ స్వాగతిస్తూ సమర్దిస్తుందని తెలిపారు. 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, 2024 ఎన్నికల్లో మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నామ కేంద్రాన్ని కోరారు.
1996లో దేవగౌడ ప్రభుత్వం, 12వ లోక్ సభలో వాజపాయ్ ప్రభుత్వం, 13,15 లోక్ సభల్లో కూడా మహిళా బిల్లు ప్రస్తావనకు వచ్చిందని , కానీ ఆమోదించలేదని అన్నారు.15వ లోక్ సభకు సంబంధించి రాజ్యసభలో ఈ బిల్లు పాసయిందని, కానీ లోక్ సభలో పెండింగ్ లో పడిందని, ఇప్పటికైనా ఆమోదించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
అయితే 2014 జూన్లో మొట్టమొదటి తెలంగాణా అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి, కేంద్రానికి పంపించి, ఇప్పటికి 10 ఏళ్లయిందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జట్పీటీసీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందని చెప్పారు.
అలాగే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత తెలంగాణా సీఎం కేసీఆర్ కు దక్కుతుందని నామ చెప్పారు. త్వరితగతిన మిగతా ప్రక్రియను పూర్తి చేసి, రానున్న ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.