మాస్టర్ ప్లాన్ లో తన భూమి పోతుందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని వైఎస్ఆర్టిపి నాయకులు పరామర్శించారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున 10 వేల ఆర్థిక సహాయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్ అందజేశారు. ఈ సందర్బంగా సుధాకర్ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ లో రైతుల భూములు లాక్కోవడం సరికాదన్నారు. పంటలు పండించే భూముల్లో ఇండస్ట్రియల్ జోన్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. మరొక రైతు బలికాకముందే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసి రైతుల భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన వైఎస్ఆర్టిపి ఉద్యమానికి పిలుపునిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు రాము, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ తాహేర్, కామారెడ్డి మండల అధ్యక్షులు రాజు, సదాశివనగర్ మండలాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నాయకులు శంకర్, శ్రీనివాస్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.