లాక్ డౌన్ ఉన్నా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని మెజారిటీ రాష్ట్రాలు కోరుతున్నట్లు కనిపిస్తున్నది. లాక్ డౌన్ ను ఎత్తేయాల్సిందిగా దాదాపు 12 రాష్ట్రాలు కోరుతున్నట్లు తెలిసింది. లాక్ డౌన్ పై రాష్ట్రాలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు ఈ నెల 17 వ తేదీ వరకూ ప్రధాని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు గడువు ఇచ్చారు.
లాక్ డౌన్ సడలింపులు, ప్రజా రవాణా ఆర్థిక పరిస్థితుల వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం ఇది ఐదవ సారి.
కరోనా గ్రామాలకు వ్యాపించకుండా చేయాలి
మహమ్మారికి అడ్డుకట్టవేయడానికి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇది కట్టడిలోకి రాకపోవడంతో ఈ వైరస్ కట్టడిలోకి వచ్చేవరకు రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పనిచేసి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని గ్రామాలకు ఈ వైరస్ వ్యాపించకుండా చేయడమే తక్షణ కర్తవ్యం అని చెప్పారు.
పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలను మోడీ అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ మరోసారి లాక్ డౌన్ ను పొడించటానికే మొగ్గు చూపారని తెలుస్తోంది.
మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
అయితే కేంద్రం మూడో విడత లాక్ డౌన్ అనంతరం ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో సమావేశంలో కాన్ఫరెన్స్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. కరోనాను అడ్డం పెట్టుకుని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. ఈ క్లిష్ట సమయంలో ఓ స్క్రిప్ట్ ను ముందే సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగా రాష్ట్రాలను మార్చుకుంటోందని తీవ్రంగా ఆరోపించారు.