పౌరసత్వ సవరణ చట్టం ననుసరించి చేసిన గణన ప్రకారం ఒక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము లోనే 50వేల ముస్లింయేతర వలసదారులు నివాసం ఉంటున్నట్లు యోగి సర్కార్ ప్రకటించింది.పౌరసత్వ సవరణ చట్టం ప్రక్రియను ప్రారంభించిన దేశంలోనే తొలిరాష్ట్రంగా ఉత్తర్ప్రదేశ్ నిలిచింది. 19 జిల్లాల్లో హిందూ శరణార్థులను గుర్తించిన యోగీ సర్కార్ వారి వివరాలతో కూడిన జాబితాను కేంద్ర హోంశాఖకు పంపించింది.
యూపీ సర్కార్ కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం 50వేల ముస్లింయేతర వలసదారులు యూపీలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించింది. ఇందులో 30 వేల నుంచి 35 వేల వరకు ఒక్క ఫిలిభిట్ జిల్లాలోనే ఉన్నట్లు గుర్తించింది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి వచ్చిన శరణార్థుల వ్యక్తిగత విషయాలను వారు ఇక్కడికి వచ్చేలా చేసిన పరిణామాలను వివరిస్తూ నివేదికలో పొందుపర్చింది. . ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ఎప్పటికప్పుడు నివేదికలను తయారు చెయ్యాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని
యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ తెలిపారు.ఇదే నివేదికను కేంద్రహోంశాఖకు పంపిస్తామని ఆయన వెల్లడించారు. శరణార్థులుగా భారత్కు వచ్చిన వారిలో అత్యధికులు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారిగా ప్రభుత్వం గుర్తించింది. వారు ఎలాంటి పరిణామాల మధ్య భారత్కు వచ్చారో అనే అంశాన్ని కూడా ఈ నివేదికలో పొందుపర్చింది.దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుండగానే వెనక్కి తగ్గేది లేదనే మొండి తనంతో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.