జగిత్యాల జిల్లా ధర్మపురి లో ఘోరం జరిగింది. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వేసిన మందులు వికటించి ఓ బాలిక మృతి చెందిన ఘటన కంటనీరు పెట్టిస్తున్నది. ధర్మపురి పట్టణం లోని స్థానిక అంగన్వాడీ కేంద్రం లో వేసిన నులి పురుగు నివారణ మందు వికటించి 8 సంవత్సరాల సహస్ర అనే విద్యార్థిని మృతి చెందడం స్థానికం గా కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే ధర్మపురి పట్టణానికి చెందిన సహస్ర రోజు లాగే తల్లి దండ్రులకు ముద్దులు పెట్టి బాయ్ చెబుతూ ఉదయం పూట బడి కి వెళ్ళింది. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నులి పురుగు మందు వేయగా సహస్ర అనే విద్యార్థికి నులి పురుగు నివారణ మాత్రలు వికటించి వాంతులు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. ఇది గమనించి స్కూల్ యాజమాన్యం, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందడం జరిగిందని వైద్యులు నిర్ధారించారు.
దీనితో విద్యార్థిని తల్లిదండ్రులు బోరు బోరున విలపిస్తున్నారు. చక్కగా బుడి బుడి నడకలతో పాఠశాలకు వెళ్లిన ఆ బాలికకు అదే రోజు చివరి రోజు అయిందని వారు రోదించడం పలువురిని కంట తడిపెట్టించింది. కాగా ప్రభుత్వం ఈ మాత్రలను మొదలు టెస్ట్ చేసి వేయాల్సిఉండేదని, ఇప్పుడు జరిగిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారని, ఆ తల్లి కడుపు కోత ఎవరు తీరుస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం జరిగిన నష్టానికి బాధ్యత వహించి ఆ కుటుంబానికి ఓదార్పు నివ్వాలని పలువు నేతలు డిమాండ్ చేశారు.