వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించే తిరువీధి సేవలను రద్దు చేసినట్లు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో ఏడు రోజుల పాటు తిరువీధి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ ప్రకారం నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకూ కార్యక్రమాలు జరగాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. ఈ మేరకు భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలోనూ, పర్ణశాల దేవస్థానంలోనూ జరిగే అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు కార్యనిర్వహణాధికారి బి.శివాజీ తెలిపారు. అయితే ఈ కార్యక్రమాలను దేవస్థానంలో ఏకాంతంలో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం లో ముక్కోటి ఉత్సవాల 1వ రోజు మత్స్యావతారం లో భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు.