బాపట్ల టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ నరేంద్ర వర్మ పై అగౌరవంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్త జోగి రాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజిని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ను కోరారు. ఈ మేరకు సోమవారం టిడిపి నాయకులతో కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా జోగి రాజా వైఖరి తీవ్ర వివాదాస్పదంగా ఉందన్నారు. మా నాయకుడు నరేంద్ర వర్మను విమర్శించే స్థాయి జోగి రాజాకు లేదన్నారు. ఎమ్మెల్యే కోన రఘుపతి అండదండలతోనే రాజా ఈ విమర్శలు చేస్తున్నాడని సరోజిని మండిపడ్డారు.
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం మా నాయకుడు చేసిన తప్పా..! రాజ్యాంగంలో ప్రతిపక్ష పార్టీకి ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీకి లేదా అంటూ సరోజిని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో జోగి రాజా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం వల్ల పట్టణంలో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
ఏదైనా జరగరాని పరిణామాలు జరిగితే దానికి ఎమ్మెల్యే బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. జోగి రాజా మా నాయకుడిని అగౌరవంగా మాట్లాడినట్లు మేము కూడా ఎమ్మెల్యేను మాట్లాడగలమని.. కానీ మా నాయకుడు అది మాకు నేర్పలేదని సరోజినీ అన్నారు. క్రమశిక్షణకు మారుపేరు టిడిపి అన్నారు. మా మంచితనాన్ని ఆసరాగా చేసుకుని నరేంద్ర వర్మపై అదే పనిగా అసభ్యకరంగా మాట్లాడితే ఇకపై చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.
ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి ఇక భవిష్యత్తులో రాజా ఇలాంటి చౌకబారు విమర్శలకు పాల్పడకుండా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము డిజిపిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో పట్టణ టిడిపి అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు ఫరీద్ మస్తాన్, పల్లం జీవన్, కూచిపూడి ఝాన్సీ రాణి, సూరగాని శేఖర్, మందపాటి ఆంద్రేయ, ఐనంపూడి షాలేం రాజు కొల్లూరి వెంకట్రావు,దార అశోక్,సోముల ప్రసాద్ ఉన్నారు.