రెండు రోజుల మాస్కో పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యారు. ఏడాది కాలంగా రష్యా తన పక్క దేశమైన ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం ఆగాలంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని, రష్యా అధ్యక్షుడికి సర్దిచెప్పగల సమర్ధుడు నరేంద్ర మోదీ ఒక్కరేనని పలు ప్రపంచ దేశాల నాయకులు ఇప్పటికే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశం కావడం ఆసక్తి కలిగిస్తున్నది. అజిత్ దోవల్ ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై వ్లాదిమిర్ పుతిన్తో విస్తృత చర్చలు జరిపారని రష్యా వెల్లడించింది. అధ్యక్షుడు పుతిన్ను ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ కలిసి ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ సమస్యలపై విస్తృత చర్చ జరిపారని కూడా వెల్లడించారు. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టంగా అమలు చేసే దిశగా పని కొనసాగించేందుకు ఇరువురు అంగీకరించారని రష్యాలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. దోవల్ తన రెండు రోజుల రష్యా పర్యటనను బుధవారం ప్రారంభించారు.