ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి 100 సీట్లతో నిర్వహించనున్న కళాశాల తరగతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూమల పట్టాలను పంపిణీ అనంతరం హెలికాప్టర్ ద్వారా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్ధిక శాఖల మంత్రితో, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు ఖమ్మం చేరుకున్నారు.
అనంతరం నేరుగా పాత కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులు కొనసాగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు. మెడికల్ కళాశాలలో కొనసాగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేసి సకాలంలో తరగతులు నిర్వహించేందుకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
పాత కలెక్టరేట్ భవనం 5 ఎకరాలు, రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం 3ఎకరాలు మొత్తం 8 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కళాశాలను ఏర్పాటు చేశామని, ఈ విద్యా సంవత్సరం తరగతులు నిర్వహించేలా తగు చర్యలు చేపట్టామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు.
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం ప్రకారం అనుమతి లభించిన దరిమిలా తరగతుల నిర్వహణకు అంతా సిద్దంగా ఉందన్నార. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కేటాయించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మంత్రులు గ్రూప్ ఫోటో దిగారు.