ధరలు తగ్గించాలని కోరుతూ ఏప్రిల్ 25న గ్రామ సచివాలయాల వద్ద నిరసన ధర్నాలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల.నర్సింహులు, సిపిఐఎంఎల్(న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుగుబెల్లి రాజేశ్వరరావులు పిలుపునిచ్చారు.
శుక్రవారం వామపక్షాలు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో క్రాంతి భవన్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపిన భారాలకు వ్యతిరేకంగా పోరాడాలని వామపక్ష పార్టీలు ప్రజలకు పిలుపునిస్తున్నాయని తెలిపారు. దేశంలో నిత్యావసరవస్తువులైన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నూనెల ధరలు ఆకాశన్నంటుతున్నాయని అన్నారు.
పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం పన్నులు పెంచి 2021-22లో రూ.4లక్షలకోట్ల ఆదాయాన్ని ప్రజల నుండి పన్నుల రూపంలో గుంజుకున్నదని తెలిపారు. బడా పెట్టుబడిదారులకు, కార్పోరేట్లకు లక్షలకోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న కేంద్రప్రభుత్వం సెస్, సర్ చార్జీలను తక్షణమే రద్దు చేసి, ఎక్సైజ్ సుంకాలు తగ్గించి ప్రజలకు ఊరట కలిగించాలని వామపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.
నేడు లీటర్ ధర రూ. 122/-లు, డీజిల్ ధర రూ. 106/- లకు వంటనూనెలైన పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగి మంటపెట్టకుండానే నూనెలు సలసల కాగుతున్నాయి. వంటనూనెలపై 30% పైగా దిగుమతి సుంకాలు వేసి కేంద్ర ప్రభుత్వం ఖజానాను నింపుకుంటున్నది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర సరుకులైన పప్పుదినుసులు, కాయగూరల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎల్.పి.జి వంటగ్యాస్ రూ. 1000/ -లకి పెరిగింది. ధరలు పెరుగుదలతో సామాన్యుల బ్రతుకులు బుగ్గిపాలవుతున్నాయి. ధరలు తగ్గించాలని మొన్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల ఎం.పిలు ఎంతగా డిమాండ్ చేసినా బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలపై వివిధ రూపాల్లో పన్నుల భారాన్ని మోపుతున్నది. విద్యుత్ చార్జీలు పెంచి రూ.4300 కోట్ల భారాన్ని మోపింది. ఇంటిపన్నులు పెంచింది. డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో ఆర్టీసి బస్సు చార్జీలు కి.మీ.కు 10పైసలు నుండి 15 పైసలు వరకు పెంచి రూ.1000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. కేంద్రప్రభుత్వం ఒత్తిడితో చెత్తపన్ను భారం మోపారు.
చెత్తపన్ను కట్టకపోతే పెన్షన్ ఆపేస్తామని బెదిరిస్తున్నారు. కిలో రూపాయి బియ్యం పథకాన్ని ఎత్తివేసి నగదు బదిలీ కాన్ని ప్రవేశ పెట్టే ఆలోచన విరమించుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పన్నుల భారాలకు, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈనెల 25న గ్రామ సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి జయప్రదం చేయాలని కోరారు.
పెట్రోలు, డీజిల్ పై కేంద్ర సెస్సు, పన్నులు తగ్గించాలని, రాష్ట్ర పన్ను తగ్గించాలని డిమాండ్ చేసారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేసారు. నిత్యావసరాలు, బట్టలు, చెప్పులపై జిఎస్టీ తగ్గించాలని స్టీల్, సిమెంటు, ఇసుక ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, రాష్ట్రప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ఆస్తి విలువ ఆధారిత, చెత్త పన్నులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.
నగదు బదిలీ విధాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటుధర కల్పించి రైతుల్ని ఆదుకోవాలని, కౌలురైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. కార్మికులకు, స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు.