హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతమైన హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబిర్ చెరువు సుందరీకరణలో భాగంగా జరుగుతున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ నేడు పరిశీలించారు. ఆయనతో బాటు ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. చెరువులను సుందరీకరణ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని, చెరువులు కలుషితం కాకుండా, కబ్జాలకు గురి కాకుండా చెరువులను పూర్తి స్థాయి లో సంరక్షిస్తామని చెప్పారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని, అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ప్రకటించారు. రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేందుకు, మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తేవడమే తమ ప్రయత్నమన్నారు. పనులను ఎక్కడా జాప్యం లేకుండా ప్రారంభించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. చెరువుల కబ్జాలకు పాల్పడే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులని ఆదేశించారు. చెరువు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ AE విశ్వం, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, జోగిపేట బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.