గిరిజన సంక్షేమ శాఖ, అమెజాన్ ఎడ్యుకేషన్ ఇనీషిఏటివ్స్ సంస్థ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూమ్ మీటింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 స్కూళ్లలో చదువుతున్న 15 వేల మంది గిరిజన బాలికలకు ఈ శిక్షణ ఉచితంగా అందిస్తున్న సంస్థను మంత్రి అభినందించారు.
ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా అందిస్తున్న ఈ శిక్షణతో, విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానమే కాకుండా, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, తెలుగు సబ్జెక్టుల కూడ నేర్చుకోవడం ఇంకా సులభం అవుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 50 స్కూళ్లలో నడుస్తున్న ఈ ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలను, అమెజాన్ సంస్థ వారు మరొక 200 స్కూళ్లలో ఈ శిక్షను ప్రారంభిస్తారని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లోని బాలికలకు ఈ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తోపాటు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక,శిక్షణ కలెక్టర్ పరమర్ పింకేశ్వర కుమార్ లలిత్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వేర్ రెడ్డి, డిప్యూటీ డైరక్టర్ ఎం. ఎర్రయ్య, ఏ టి డి ఓ సత్యవతి, అమెజాన్ ప్రతినిధులు రాజ్ శశాంక్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ నుండి తనుశ్రీ ,రణధీర్, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.