అధికారులు తనకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా తీవ్రంగా మనో వేదనకు గురి అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీకి చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు కూడా.
ఎన్నికల కమిషనర్ చిత్తూరు జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయడంతో ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే. ఇలా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే అధికారుల చేతుల్లో అవమానాల పాలవుతున్నారు. తాజాగా అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి అవమానం జరిగింది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన గణతంత్ర వేడుకలకు కనీసం ఆయన్ను ఆహ్వానించలేదు అధికారులు. దీంతో జిల్లా అధికారులపై మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి, అధికార పార్టీకి చెందిన నేత అయిన తనకు కూడా గణతంత్ర వేడుకలకు ఆహ్వానం రాకపోవడంపై మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా అధికారుల మీద నిరసన తెలిపారు. ‘జిల్లా ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను కూడా గణతంత్ర వేడుకలకు పిలవరా? నన్ను ఎందుకు ఆహ్వానించలేదు?
అధికారుల నిర్లక్ష్యమా? లేకపోతే అహంకారమా?. ఎందుకు ఆహ్వానించలేదని ప్రోటోకాల్ అధికారిని అడిగితే మేం చిన్నవాళ్లం. మీకు సమాధానం చెప్పలేం అంటున్నాడు. దీన్ని వదిలి పెట్టం. దీనిపై రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా.’ అని ఆనం రాంనారాయణరెడ్డి హెచ్చరించారు.