ఉత్తరప్రదేశ్ లో కారుతో తొక్కించి రైతుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి లో అంబేద్కర్ విగ్రహం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్నితిరుపతియ్య మాట్లాడుతూ రైతు హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నదాతలను కారుతో ఢీకొట్టి అత్యంత పాశవికంగా హత్య చేయడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
ఈ సంఘటనకు బాధ్యుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులను కారుతో తొక్కించి ఎనిమిది మంది రైతుల మరణాలకు కారణమైన మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు గుంటకసాంబిరెడ్డి, బండ్లమూడి రాంబాబు, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, జవ్వాది సాంబశివ రావు, గంజి వెంకయ్య, యార్లగడ్డ అంకినేయుడు తదితరులు పాల్గొన్నారు.