కామన్ ఎంట్రెన్స్ కు దరఖాస్తులు చేసుకోండి:రిజిస్ట్రార్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లోని అన్ని పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష రాసేందుకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులు సమాయత్తం కావాలని ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణ రెడ్డి సూచించారు. మొత్తం 15 యూనివర్సిటీల్లో అడ్మిషన్లకోసం తొలిసారిగా కామన్ ఎంట్రన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించబోదని స్పష్టం చేశారు. కామన్ ఎంట్రన్స్ టెస్టుకు దరఖాస్తు చేసే విధానం,ఇతర నిబంధనల పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఆన్ లైన్ లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ఎంట్రన్స్ నిర్వహిస్తుందనే భావనలో ఇంకా చాలా మంది ఉంటున్నారని, అది అవగాహన లోపమని ఆయన స్పష్టం చేశారు. డిగ్రీ ఫైనల్ పరీక్షల సందర్భంగానే ఈ విషయాన్ని తెలిజేయాల్సిందిగా కళాశాలల్ని కోరామని, ఇప్పటికీ విద్యార్థుల్లో పూర్తిస్థాయిలో స్పష్టత లేదనిపిస్తోందన్నారు. ఎంట్రన్స్ కు దరఖాస్తు చేయడానికి తుది గడువు బుధవారం 06.10.2021తో ముగుస్తుందని రూ. 500/- అపరాధ రుసుంతో ఈ నెల ఎనిమిదో తేదీ వరకు గడువు ఉందని చెప్పారు.
వివరాలకు ఉన్నత విద్యామండలి వెబ్ సైట్, కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వెబ్ సైట్ ను సందర్శించవచ్చున్నారు. ఎపిపిజి సెట్ -2021 ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు నింపి పంపవచ్చని తెలిపారు.
పరీక్ష ఫీజు ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఉందని చెప్పారు. ఎపి ఆన్ లైన్ కేంద్రాల్లో సంప్రదించి దరఖాస్తు పంపవచ్చని,అభ్యర్ధులు తమ వివరాల్ని ఎలాంటి అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.