అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లి లో వెలసిన శ్రీ ముత్తుమారమ్మ తల్లి ఆలయంలో ఇటీవల జాతర మహోత్సవాన్ని తెలియజేసే చాటింపు వేశారు. ప్రతి సంవత్సరం జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి అమ్మవారి జాతర మహోత్సవానికి భక్తులు విచ్చేసి తమ మొక్కుబడులను తీర్చు కుంటారు. 100 సంవత్సరాలు పైబడి నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ ముత్తు మారమ్మ తల్లి ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీ ముత్తుమారమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఆగస్టు నెల 12వ తేదీ ప్రారంభమై 14వ తేదీ ముగుస్తాయని ఆలయ కార్య నిర్వాహకులు తెలిపారు. 12వ తేదీ శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం గ్రామ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం, 13వ తేదీ ఆదివారం జాతర మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి తమ మొక్కుబడులను తీర్చుకుంటారని అన్నారు. 14 వ తేదీ సోమవారం అమ్మవారికి ప్రత్యేకంగా పాల పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడంతో జాతర మహోత్సవాలు ముగుస్తాయని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు