కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కి సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు ఆటో యూనియన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కి ఈ మేరకు రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ సింగ్, కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు తీర్మానం కాపీని అందించారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆటో కార్మికులకు రవాణా పన్నును రద్దు చేశారు. ప్రతి ఆటో కార్మికునికి రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందించిన ఘనత దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరికి దక్కింది. యూనియన్ తరపున కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించడం అభినందనీయం అని అన్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ను ఒప్పించి రవాణా పన్నును రద్దు చేయించారని, ఐదు లక్షల బీమా కార్యక్రమాన్ని అమలుపరచాలని అందుకు మహేందర్ రెడ్డికి రాము రుణపడి ఉంటామని ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు.