రాష్ట్రంలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలో ప్రశ్న పత్రాల లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండు రోజులుగా 10వ తరగతి ప్రశ్నా పత్రాలు లీకేజీ కావడం పట్ల కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్,ఎస్పీలు అప్రమత్తం కావాలని, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకోంటూ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ లో దాదాపు 57 వేల మంది విధులు నిర్వహిస్తున్నారని, ఒకరిద్దరు చేసిన తప్పిదాలతో పిల్లలు, తల్లి దండ్రులు ఆందోళనకు గురవుతున్నారని మంత్రి తెలిపారు.
పరీక్ష ప్రారంభించిన తర్వాత పేపర్ బయటకు వచ్చిందని, దీని వల్ల ప్రభుత్వానికి అనవసరంగా చెడ్డ పేరు వస్తుందని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల ప్రాంతాల్లో అత్యంత కఠినంగా 144 సెక్షన్ అమలు చేయాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో సెక్యూరిటీ టైట్ చేయాలని, పరీక్షా కేంద్రాల లోపలికి ఎవరికి సెల్ ఫోన్ లను అనుమతించ రాదని, జిల్లా కలెక్టర్ లు, తహసిల్దార్ లు సైతం సెల్ ఫోన్ తీసుకోని వెళ్ళవద్దని తెలిపారు. 10వ తరగతి జవాబు పత్రాల రవాణా సమయంలో స్థానిక పోస్టల్ అధికారులకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. మిగిలిన 4 పరీక్షలు సజావుగా జరిగే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో అదనపు పేట్రోలింగ్ చేయాలని, క్షేత్రస్థాయి వరకు ఎక్కడా అలసత్వం జర్గకుండా అప్రమత్తం వహించాలని తెలిపారు. ప్రశ్న పత్రాల లీకేజీ లకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల పై అత్యంత కఠినంగా శిక్షిస్తామని, విద్యా శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులను సర్వీస్ నుంచి తోలగించడం జరుగుతుందని తెలిపారు.