హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని బాలకృష్ణ స్పష్టం చేశారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ పోరాటం కొనసాగుతోంది. నిన్న మౌనదీక్ష చేపట్టిన బాలకృష్ణ.. ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. హిందూపురం నుంచి అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చేరుకున్నారు. బాలకృష్ణతో పాటు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని బాలకృష్ణ డిమాండ్ చేశారు. హిందూపురం కేంద్రంగా జిల్లాకు సత్యసాయి పేరు పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు. హిందూపురం జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్ధమేనని, అలా ప్రకటించేవరకు పోరాడతానని తెలిపారు.