డిసెంబర్ 9న, బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు బిసి శ్రేణులకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు బిసి సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలో 2600 బిసి కులాలు ఉండగా 2550 కులాలు నేటికీ పార్లమెంటులో అడుగు పెట్టలేదని, రాష్ట్రంలో 129 కులాలు ఉండగా 119 కులాలు నేటికీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదన్నారు. ఇది ప్రజాస్వామ్య విధానం ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చి74 సంవత్సరాలైనా బిసి, ఎస్సీ, ఎస్టీలు సబ్సిడీ బియ్యం కోసం, పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు దీక్షలు నిర్వహించాలనే పిలుపు మేరకు ఈ నెల 9న, హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాకార్యక్రమలో బిసి సంఘాల నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు బిసి సంఘం నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.