ఈనెల 25,26,27 తేదీలలో తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరులో జరిగిన ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రం నుండి మరొకరికి చోటు లభించింది. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన బి జి క్లెమెంట్ ను జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవ ఎన్నిక చేయడం జరిగింది. బి. జి. క్లెమెంట్ విద్యార్థిగా ఉన్న సమయంలో 1977 వ సంవత్సరంలో అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) ద్వారా వామపక్ష రాజకీయాలకు ఆకర్షితుడై వివిధ దశలలో పోరాటాలకు నాయకత్వం వహించి అంచలంచెలుగా ఎదిగారు.
అనంతరం భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆవిర్భవించిన ఏఐటీయూసీ లో 1990వ దశకంలో చేరారు. కార్మిక వర్గ పోరాటంలో అనేక పోరాటాలను రూపకల్పన చేయటంతో ఆయన 2010వ సంవత్సరంలో ఏఐటియుసి ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా, తదనంతరం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2010 నుండి రాష్ట్ర సమితిలో కొనసాగుతున్న బి. జి క్లెమెంట్ తొలిసారిగా జాతీయ కౌన్సిల్లోకి అడుగుపెట్టడం జరిగింది. అనేక కార్మిక వర్గ పోరాటాలకు నాయకత్వం వహించిన బి.జి క్లెమెంట్ ను ఖమ్మం నగర ప్రజలు రెండుసార్లు కార్పొరేటర్ గా గెలిపించుకోవడం జరిగింది.
దాదాపు మూడు దశాబ్దాలుగా కార్మిక రంగంలో పనిచేస్తున్న ఆయన ఎన్నిక పట్ల ఏఐటీయూసీ మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పోటు ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు గాదలక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ కౌన్సిల్ కు ఏకగ్రీవంగా ఎన్నికైనందుగాను బి జి క్లెమెంట్ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ఈరోజు నుంచి తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. రాష్ట్ర, జిల్లా నాయకులను సమన్వయం చేసుకొని రాబోయే రోజులలో బడుగు బలహీన వర్గాల,కార్మికుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. వలస కార్మికుల వ్యదలను ప్రజలకు, ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళటానికి భవిష్యత్తులో సమస్యల పోరాటానికి రూపకల్పన చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.