ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీపై ఉద్యోగులు చేస్తోన్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ఉద్యోగుల సమస్యలు తీరలేదని మండిపడ్డారు. తమ ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ప్రకటించారు. రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఎలా పోరాడాలో తేల్చుకోలేని అయోమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులంతా భావిస్తే, వారితో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు 19 శాతం ఐఆర్ తేడా ఉందని తెలిపారు. గతంలో నాలుగేళ్లకోసారి ఆర్టీసీలో వేతన సవరణ ఉండేదని, ఇప్పుడు మాత్రం పదేళ్లకోసారి అంటున్నారని మండిపడ్డారు.