కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని 30 పడగల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ 26 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వంద పడకల ఆసుపత్రి అప్ గ్రేడ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షణ సిబ్బంది మంత్రికి తమను రెగ్యులర్ చేయాలంటూ వినతిపత్రం సమర్పించారు,
వారితోపాటు ఏఎన్ఎంలు కూడా వినతి పత్రం సమర్పించారు. అనంతరం బండయప్ప కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే హనుమంతు షిండే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను శాయశక్తుల కృషి చేస్తున్నానని అందుకు ప్రభుత్వ పెద్దల సహకారం ఎంతో ఉందన్నారు. వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం ఎంతగానో ఉందని ఆయన అన్నారు.
జుక్కల్ నియోజకవర్గం అటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సరిహద్దు ఉండడం వలన చాలా ఇబ్బందులు ఉండేవని ఈ వంద పడకల ఆసుపత్రితో మరింత మెరుగైన వైద్యం అందుతుందన్న ఆశ భావం వ్యక్తం చేశారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే షిండే అహర్నిశలు కృషి చేస్తున్నారని ఇందులో భాగంగానే విద్యారంగంగానే వైద్యరంగం గాని ఈ ప్రాంతంలో మెరుగుపడిందన్నారు.
గతంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడి నుండి మనం పోదాం బిడ్డో సర్కారు దవాఖానకు అనే ఊత పదం వచ్చిందన్నారు. సర్కార్ దవాఖానాలో మెరుగైన వైద్యం అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది అన్నారు. కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని స్థితిగతులు జాతీయ నాయకత్వానికి ఏం తెలుసని ప్రశ్నించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కెసిఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జుక్కల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే హనుమంత్ షిండేకు భారీ మెజారిటీతో గెలిపించి మరింత అభివృద్ధి సాధించాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. మృదు స్వభావి మంచి వ్యక్తి హనుమంత సిందే అని కితాబిచ్చారు. కాంగ్రెస్,బిజెపి కల్లబొల్లి మాటలు నమ్మరాదన్నారు. నమ్మిన మంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో వీరితోపాటు జడ్పీ చైర్ పర్సన్ దఫెదర్ శోభ రాజు, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్, బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్, వైస్ ఎంపీపీ రాజు పటేల్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు నాగనాథ్ పటేల్, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు వెంకటరావు దేశాయి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు శ్రీహరి, సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ (బాలు శ్రీహరి), జుక్కల్ అధ్యక్షులు మాధవరావు దేశాయి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జి.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం