విజయనగరంలోని వ్యాసనారాయణ మెట్ట, నల్లచెరువు ప్రాంతంలోని శిల్పారామం ఆనందానికి, అహ్లాదానికి కేంద్ర బిందువుగా మారింది. జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాల మేరకు, మహిళలు, పిల్లల కోసం జిల్లా యంత్రాంగం పలు కార్యక్రమాలు నిర్వహించింది.
మహిళలకు రంగోలీ ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహించగా, పిల్లలకు ఫ్యాషన్ షో ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నగరంలో స్వల్పంగా వర్షం పడుతున్నప్పటికీ, మహిళలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉత్సాహంగా ముగ్గులు, వంటల పోటీల్లో పాల్గొన్నారు.
మహిళా శిశు సంక్షేమశాఖ, పర్యాటక శాఖలు సంయుక్తంగా రంగోలి, పిండివంటల పోటీలు నిర్వహించాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 50 మంది మహిళలు రంగోలి పోటీల్లో పాల్గొని అందమైన రంగవల్లులతో తమ ప్రావీణ్యాన్ని చూపారు. ఈ పోటీల్లో నరవ గ్రామానికి చెందిన ఎం.దేవి(ప్రథమ), చీపురుపల్లికి చెందిన టి.రాజేశ్వరి(ద్వితీయ), పూల్ బాగ్ కాలనీకి చెందిన ఎం.రాజేశ్వరి(తృతీయ) బహుమతులను గెలుచుకున్నారు.
జిల్లా పంచాయతీ అధికారి సుభాషిణి విజేతలకు బహుమతులు అందించారు. డిఆర్డిఎ పిడి కల్యాణ చక్రవర్తి, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు డైరక్టర్ డి.శాంతకుమారి, జిల్లా పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, సిడిపిఓలు ప్రసన్న, ఆరుద్ర, తవిటి నాయుడు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు తయారుచేసిన పిండివంటలను శిల్పారామంలో ప్రదర్శించారు. ఆంధ్ర ప్రాంత సంప్రదాయ పిండివంటకాలైన జంతికలు, అరిసెలు, బూరెలు, గారెలు, సున్నండలు, వేరుశెనగ పప్పుండలు, చేగొడీలు తదితర రకాలైన నోరూరించే పిండి వంటకాలను ప్రదర్శించారు.
వంటల పోటీల్లో చిట్టితల్లి (ప్రథమ), సంధ్య (ద్వితీయ), లక్ష్మి (తృతీయ), కె.కామేశ్వరి(నాల్గవ), ఏ.లక్ష్మి,,(ఐదవ, బహుమతిని గెలుచుకున్నారు. చిన్నారుల ఫేషన్ షో ఆకట్టుకుంది. ఈ ఫేషన్ షో లో జ్యోషిత, ఎల్.హాసిని, వర్షిత వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలక్టర్ సూర్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి, జిల్లా పర్యాటక శాఖాధికారి లక్ష్మీనారాయణ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.