బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కాలేవని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్ రెడ్డి. గతంలో రేవంత్ రెడ్డి టిడిపిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
వాళ్ళ నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్ లేదని అసెంబ్లీలో చెప్పారు. ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు, ఇటలీ బొమ్మ అన్నాడు నోటికి ఏదోస్తే అదే తిట్టిండు. ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నాడు..రేవంత్ నోటికి మొక్కాలి. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడుతా బీజేపీపై పోరాడే డిఎన్ఏ నాది అన్నారు. మరి రేవంత్ రెడ్డి డిఎన్ఏ ఏదో రాహుల్ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డిఎన్ఏ లు మ్యాచ్ కావట్లేదు అని హరీష్ రావు విమర్శించారు. మేం ఎవ్వరికీ బీ టీం కాదు మేం తెలంగాణ ప్రజల టీం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికి ఒకటి కాదు అని ఆయన అన్నారు.