తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని ప్రార్థించామని టిటిడి తిరుపతి జెఈవో పి.బసంత్కుమార్ అన్నారు.
ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెఈవో మాట్లాడుతూ కోవిడ్-19 నేపథ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. పరిమిత సంఖ్యలో సిబ్బందితో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయశుద్ధి) నిర్వహించామన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో కరోనా వ్యాధి పూర్తిగా దూరం కావాలని ఆకాంక్షించారు. అంతకుముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
12 పరదాలు విరాళం
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన అడ్డకట్ల శ్రీనివాసులు, శారద దంపతులు 12 పరదాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల తరఫున వారి ప్రతినిధులు జెఈవోకు అందజేశారు.