రాష్ట్రవ్యాప్తంగా సాగు చేస్తున్న పోడు రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తులు చేసిన వాటన్నిటికీ హక్కు పత్రాలు ఇవ్వాలని అదే విధంగా గత పది సంవత్సరాల కాలంలో పోడు రైతులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిపిఎం వైరా నియోజకవర్గ సమావేశం ఖమ్మం సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిటికీ హక్కులు కల్పిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేడు గిరిజనులకే ఇస్తాము అని ప్రకటించడం రాబోయే కాలంలో గిరిజనేతర రైతుల భూములను లాక్కునే కుట్ర చేస్తున్నట్లుగా అనుమానించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈనెల 24 నుంచి పోడు భూముల కు హక్కు పత్రాల పంపిణీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మిగతా వారికి కూడా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైరా నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గిరిజనులకు పట్టాలు వస్తున్నయ్ అంటే సిపిఎం గిరిజన సంఘాల పోరాట ఫలితమేనని పోడు రైతులు గమనించాలని కోరారు.
గిరిజనులందరికి కూడా పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు ఇచ్చే పరిస్థితి కనబడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడితే తప్ప హక్కులు సాధించలేమని, భవిష్యత్ పోరాటాల్లో ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. రైతుల లక్ష రూపాయల రుణమాఫీని కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.