చేతకానీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నంత కాలం నల్గొండ జిల్లా అభివృద్ది చెందదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోసమే తన మాటలతో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సోమవారం నల్గొండ పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్లో విలేఖరులతో మాట్లాడుతూ చేతకానీ దద్దమ్మ జగదీష్ రెడ్డి ఉన్నంత కాలం నల్గొండ జిల్లాకు నిధులు రావని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయంలో వైఎస్తో కొట్లాడి శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టు తీసుకువచ్చి 90శాతం పనులు పూర్తి చేస్తే వెయ్యి కోట్ల నిధులు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చెయ్యడానికి కేసీఆర్కు చెయ్యి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 ఎన్నికల్లో కుర్చీ వేసుకుని శ్రీశైలం సొరంగం పనులు, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తిచేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. ఉత్తర తెలంగాణలో నిజాంసాగర్ కాకతీయ, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ బ్రహ్మండంగా కట్టుకుని ఎఎమ్ఆర్ కెనాల్కు లైనింగ్ పనులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సిరిసిల్లా,సిద్దిపేట, గజ్వేల్కు నిధులు కుమ్మరించిన కేసీఆర్.. దత్తత తీసుకుంటానని చెప్పిన నల్గొండ జిల్లాను మాత్రం పట్టించుకున్న పాపాన పోవట్లేదని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లాను దత్తత తీసుకున్నా అన్నావు గిట్లనే అభివృద్ది చెందకుండా ఉంటదా అని ప్రశ్నించారు.
హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకువచ్చిన కేసీఆర్ ఎన్నికల తరువాత అన్ని బంద్ అన్న ఆశ్చర్యం లేదన్నారు. మాట తప్పితే మెడ నరకుంటానని మాట తప్పిన కేసీఆర్ దళిత బంధు అంటే నమ్మలేమని ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత అన్ని బంద్ అన్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు.
జగదీష్ రెడ్డి మంది మార్భాలం, పోలీసులతో కాకుండా ఒక్కడివే తిరిగితే నీ మీద ఉన్న ఆగ్రహం తెలుసుందన్నారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎలాగు గెలవలేవు కాబట్టి పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువలను పూర్తి చేస్తే ప్రజల్లో ఆగ్రహం అన్న తగ్గుతుందని వివరించారు. ఎన్నికలకు స్కూటర్ మీద తిరిగిన జగదీష్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు తలిచే అర్హత కూడా లేదన్ననారు.
బీసీ, మైనార్టీలకు దళిత బంధు తరహాలో సాయం చేయాలన్నారు. ప్రతి సామాజికవర్గంలో పేదలు ఉన్నారు కాబట్టి పేదలు ప్రతి ఒక్కరికి రూ. 10లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ నల్గొండకు వస్తే ప్రజలు ఉరికించి ఉరికించి కొడుతారని మంత్రికి తెలిపారు.
పెద్ది నరేందర్, సత్యం న్యూస్, నకిరేకల్