తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని రాష్ట్ర రావణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరం దంసలాపురం సర్కిల్ లోని ఆయన విగ్రహానికి మంత్రి పువ్వాడ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని, సిఎం కెసిఆర్ ఆ కలను నిజం చేసి చూపించారని ప్రశంసించారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ప్రొఫెసర్ గా కెసిఆర్ కి ఆప్తుడుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు.
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, రాష్ట్రం ఎందుకు అవసరమో అవగాహన కల్పిస్తూ ఉద్యమాన్ని ఏకతాటిపైకి నడిపించిన ఉద్యమకారుడు జయశంకర్ అని అభివర్ణించారు. నాలుగు దశాబ్దాలు ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో గొప్ప పాత్ర పోషించారన్నారు.వారి చిరకాల స్వప్నాన్ని నేడు కేసీఅర్ ఆచరణలో చూపారని వారి ఆశయాలను సాధించారని అన్నారు.