ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం సీబీఐ తో ఆటలాడుకుంటున్నది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ కొందరు ప్రముఖుల అభీష్టానికి వ్యతిరేకంగా అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే.
సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని హత్య కేసులో నిందితులు కడప పోలీసులకు ఫిర్యాదులు చేయడం, దానిపై పోలీసులు కేసులు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుల్లో సీబీఐ దర్యాప్తు అధికారినే టార్గెట్ చేసుకోగా హైకోర్టు స్టే ఇవ్వడంతో ఏపి పోలీసులు స్పీడు తగ్గించారు. ఇలా వివేకా హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ కి దర్యాప్తులో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
తాజాగా సీబీఐ కి నిలువ నీడ లేకుండా చేసే ప్రయత్నం ప్రారంభం అయిందనే వాదనలు మొదలయ్యాయి. కడప ఆర్ అండ్ బి అతిథి గృహంలో సీబీఐ అధికారులు బస చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా సీబీఐ అధికారులు ఇక్కడే ఉండి తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. సీబీఐ అధికారుల కింద అక్కడ మూడు గదులు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు గదులను ఖాళీ చేయాలని సీబీఐ అధికారులకు నోటీసులు జారీ చేశారు.
తక్షణమే మూడు గదులు ఖాళీ చేసి తమకు అప్పగించాలని ప్రభుత్వం కోరుతున్నది. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున ముఖ్యమైన వారు వస్తారని అందువల్ల తాము గదులను సీబీఐ కి ఇవ్వలేమని అధికారులు అంటున్నారు. దీనిపై సీబీఐ ఎలా స్పందిస్తుందో తెలియదు.