రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టే మంచినీళ్ళ పండుగ, హరితోత్సవం, విద్యా దినోత్సవం, ఆధ్యాత్మిక దినోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.
హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ఆదివారంనాడు తెలంగాణ మంచి నీళ్ల పండుగ ఘనంగా జరపాలని అన్నారు.
జిల్లాలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లను విద్యార్థులు సందర్శించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించాలని సీఎస్ తెలిపారు.
జూన్ 19న తెలంగాణ హరితోత్సవం పెద్దఎత్తున చేపట్టాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును ప్రజల్లో వివరించాలన్నారు.
గుంతలు తీయడం, మొక్కలను తరలించడం పూర్తి చేయాలన్నారు. జూన్ 20న విద్యా దినోత్సవంన మన ఊరు- మన బడి కార్యక్రమంలో పూర్తయిన పాఠశాలల పునః ప్రారంభం చేపట్టాలన్నారు. సిద్ధంగా ఉన్న రీడింగ్ రూంలు, డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవం చేయాలన్నారు.
విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించాలన్నారు. ఈ నెల 21 న ఆధ్యాత్మిక దినోత్సవం రోజున అన్ని మతాలకు సంబంధించిన ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని అన్నారు.